అక్కినేని నాగచైతన్య, సమంత జంట త్వరలోనే విడిపోనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తుండగా, ఇప్పుడు భరణం మాట కూడా ప్రస్తావనకు వస్తోంది. ఈ-టైమ్స్ కథనం ప్రకారం…వారిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోనున్నారు. ఈ తతంగం పూర్తి కావడానికి మరో రెండు లేదా మూడు నెలలు పట్టవచ్చు. విడాకుల అనంతరం భరణంగా సమంతకు రూ.50 కోట్లు ముట్టజెప్పనున్నారు. ఇందులో స్థిర, చరాస్తులు ఉన్నాయి.
2017 అక్టోబరులో నాగచైతన్య, సమంతల వివాహం జరిగింది. గత కొద్ది వారాలుగా వారిద్దరూ విడి విడిగా ఉంటున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. గత జులైలో సమంత సోషల్ మీడియాలో తన డిస్ప్లే పేరు నుంచి అక్కినేని అనే ఇంటి పేరును తొలగించి, ఎస్ అనే పదాన్ని చేర్చుకుంది. తద్వారా వారి మధ్య ఏవో కలతలు చెలరేగినట్లు వదంతులు వినిపిస్తూ వస్తోంది. తన సోషల్ మీడియా పేజెస్లో అక్కినేని అనే పదాన్ని తొలగించి ఎస్ అని ఎందుకు చేర్చుకోవాల్సి వచ్చిందో సమంత ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. ఇటీవల సమంత తిరుమలో శ్రీవారిని దర్శించుకుని వచ్చిన అనంతరం, ఓ విలేకరి విడాకుల ప్రస్తావన తీసుకురాగా ఆమె అగ్గి మీద గుగ్గిలమైంది. దైవ సన్నిధిలో ఇలాంటి మాటలెందుకని…ఆ విలేకరిని కడిగి పారేసింది. ప్రస్తుతం సమంత ఓ తెలుగు, మరో తమిళ సినిమాలో నటిస్తోంది.