మార్మోగిన రైతుల ఆందోళన

మార్మోగిన రైతుల ఆందోళన

న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుక్ర వారం ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆందోళనలతో మార్మోగాయి. మూడు వివాదాస్పద వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటామని గత వారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రైతు సంఘాలు ఈ చర్యను స్వాగతిస్తున్నాయని, అయితే చట్టాలను అధికారికంగా రద్దు చేసి ఇతర డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరసనను విరమించేది లేదని రైతులు ముక్త కంఠంతో చెప్పారు.నిరసనకు ఒక సంవత్సరం సందర్భంగా ఢిల్లీ సరిహద్దులో శుక్రవారం భారీ సభ నిర్వహించారు. ఢిల్లీ చలో కార్యక్రమంలో వేలాదిసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.వ్యవసాయ పంటలకు కనీస మద్ధతు ధర ఇచ్చేలా చట్టపరమైన హామీతో సహా తమ డిమాండ్లు నెరవేరే వరకు రైతుల ఆందోళన కొనసాగుతుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ టికాయత్ చెప్పారు. దేశ రాజధానిలోని పలు సరిహద్దు పాయింట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టు దిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఏడాది కాలంగా రైతులు సింగు, తిక్రీ, ఘాజీపూర్ ప్రాంతాల్లో క్యాంపులు వేసి నిరసన కార్యక్రమాలు సాగిస్తున్నారు.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, లఖింపూర్ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తొలగించి, అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos