గువాహటి: పౌరసత్వ చట్ట సవరణతో ఈశాన్య రాష్ట్రాలు మండుతున్నాయి. అసోం, త్రిపురల్లో నిరసన జ్వాలలు తారస్థాయికి చేరుకోవడంతో నిరవధిక కర్ఫ్యూ విధించారు. దరిమిలా ఇక్కడ జరుగుతున్న అసోం.సర్వీసెస్(ఎస్ఎస్సీబీ) రంజీ క్రికెట్ పందేనికి గురువారం అవరోధం కలిగింది. నాలుగో రోజు ఆటను నిలిపివేశారు. అగర్తలాలో జరుగుతున్న త్రిపుర×ఝార్ఖండ్ మ్యాచ్ నాలుగో రోజు ఆటను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత గతంలో ప్రకటించినట్లే యధావిధిగా జరుగుతుందని వివరించారు. ఇండియన్ సూపర్ లీగ్-నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ× చెన్నయిన్ ఎఫ్సీ జట్ల మధ్య ఇక్కడి ఇందిరా గాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో గురువారం జరగాల్సిన పోటీని వాయిదా వేసినట్లు ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలెప్మెంట్ సంస్థ తెలిపింది.