అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా విధానాల్ని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియల్ అభినందించారు. గ్రామ సచివాలయాలు, విద్యా సంస్కరణలను ప్రశంసించారు. గురువారం వెబినార్ ద్వారా జరిగిన ఎన్సీఈఆర్టీ 57వ సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్ఆర్డీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా కానుక, నాడు నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాల్ని వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్ మాట్లాడారు. జగన్ ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థతో చాలా మంచి పాలన అందిస్తున్నారన్నారు. అది ప్రజలకు మేలు చేస్తోందని ప్రశంసించారు. విద్యామృతం, విద్యా కళశం ఆన్ లైన్ క్లాసులు నిర్వహించటంపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారాన్ని అంది స్తుండటం సంతోషమన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇలా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.