ప్రజావాహిని-బెంగళూరు
భవన సదుపాయాలున్న ఉన్నత పాఠశాలల్లో పీయూసీ తరగతుల్ని ఆరంభించాలని సొరబ సభ్యుడు కుమార బంగారప్ప చేసిన సూచనకు విద్యా మంత్రి నాగేశ్ గురు వారం విధానసభలో సానుకూలంగా స్పందించారు. తమ నియోజక వర్గం లో పీయూసీ కోర్సుల్ని ఆరంభించాలని బాగేపల్లి సభ్యుడు సుబ్బా రెడ్డి విన్నవించినపుడు జోక్యం చేసుకున్న కుమార బంగారప్ప ఆ సలహా ఇచ్చారు. నూతన విద్యా విధానంలో పీయూసిని 11, 12 తరగతులుగా పరివర్తన కూడా చేసారన్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 70-80 నుంచి నూటికి పెరిగినందున పీయూసీ కోర్సుకు విద్యార్థుల రద్దీ పెరిగిందని సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యల్ని తీసుకోవాలని కోరారు.
3590 ఖాళీలు
ఉన్నత పాఠశాలల్లో 3590 ఉపాధ్యాయ ఖాళీలున్నాయని మంత్రి నాగేశ్ అంగీకరించారు. శ్రవణ బెళగొళ సభ్యుడు బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. వీటిలో 1801 ఆంగ్ల భాష బోధకులు. దరిమిలా పల్లెల్లో విద్యార్థులు ఆంగ్ల భాష పరీక్షల్లో నెగ్గటం లేదని ఆక్రోశించారు. ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయుల్ని నియమిస్తామని నాగేశ్ తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతి లభించాక శాశ్వత ఉపాధ్యాయుల్ని ఎంపిక చేస్తామని వివరించారు.