హొసూరు : హొసూరు సమీపంలో పలు గ్రామాలకు వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కెలవరపల్లి డ్యాం నుంచి తట్టిగాణపల్లి వరకు రోడ్డు గుంతలమయమైంది. ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని తట్టిగాణపల్లి, సిధ్ధనపల్లి, నందిమంగలం గ్రామస్థులు సంబంధిత ఆధికారులకు పలు దఫాలుగా విజ్ఞప్తి చేశారు. స్పందన లేకపోవడంతో విసిగిపోయిన గ్రామస్థులు సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో తట్టిగాణపల్లి వద్ద హొసూరుకు వెళ్ళే రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి అక్కడికి చేరుకొని గ్రామస్థులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. వారం రోజుల్లో రోడ్డుకు మరమ్మతులు చేసేవిధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు పూర్తి చేస్తామని బాలకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎడీఎంకే నాయకులు త్యాగరాజరెడ్డి, హరీష్ రెడ్డి ఉన్నారు. ఆందోళనలో సీపీఎం నాయకులు కోదండరామం, రాజారెడ్డి, నారాయణరెడ్డి, దేవరాజ్ ప్రభృతులు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.