షాద్నగర్ : ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను పోలీసుల దర్యాప్తు అనంతరం కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే ప్రజాగ్రహం కారణంగా వారిని కోర్టులో ప్రవేశపెట్టడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీంతో మండల మెజిస్ట్రేట్ పాండునాయక్, డాక్టర్లు నేరుగా షాద్నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపారు. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆందోళకారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో వారి కంటపడకుండా నిందితులను తరలించేందుకు దాదాపు పదికి పైగా వాహనాలను సిద్ధం చేశారు. ఇదిలావుండగా పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు అయిదు గంటలుగా ఆందోళకారులు పెద్ద ఎత్తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు స్టేషన్లోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో.. స్టేషన్ ప్రధాన గేటుకు తాళం వేశారు. ఆందోళనకారులు పోలీసులపై కోపంతో చెప్పులు విసిరారు. పరిస్థితిని అదుపు చేయడానికి స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. పటిష్ట బందోబస్తు నడుమ నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.