తల్లితండ్రులు మందలించారని సన్యాసినులుగా మారడానికి కశ్మీర్కు వెళుతున్న ఇద్దరు బాలికలను పోలీసులు రక్షించారు.చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తికి ఇద్దరు కవల పిల్లలున్నారు. వీరు తిరుపతిలో ఇంటర్ చదువుతూ, ఇటీవల సంక్రాంతి సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చారు. వారిద్దరూ సరిగ్గా చదవటం లేదని తల్లి మందలించింది.ఈ క్రమంలో కాట్పాడిలో ఉన్న బంధువుల ఇంటిలో వారిని దింపిన తండ్రి, కొన్ని రోజులు అక్కడుండి రావాలని చెప్పాడు. తండ్రి అటు వెళ్లగానే, ఇద్దరు అమ్మాయిలూ రైలు ఎక్కి కర్నూలుకు వెళ్లారు. పిల్లలు కనిపించని తల్లిదండ్రులు, పోలీసులను ఆశ్రయించగా, తొలుత వారి సెల్ ఫోన్ కూడా పని చేయలేదు. ఆపై బుధవారం సాయంత్రం వారి ఫోన్ ఆన్ కావడంతో, వారు ఎమ్మిగనూరు దగ్గర ఉన్నట్టు గుర్తించారు.వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి, వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆమధ్య వచ్చిన ‘దేశముదురు‘ సినిమాలోని హీరోయిన్ మాదిరిగా సన్యాసినులుగా మారాలని తాము భావించామని, కశ్మీర్ వెళ్లాలని అనుకున్నామని వారు పోలీసుల విచారణలో చెప్పడంతో అవాక్కయ్యారు. ఓ స్నేహితురాలు తమకు ఈ సలహా ఇచ్చినట్టు చెప్పడంతో, వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు, ఇకపై ఇలా చేయరాదని హెచ్చరించి పంపారు.