శ్రీ నగర్: జమ్ము- కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. శ్రీగుఫ్వారా – బిజ్బెహరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ ఓటమి పాలయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ మేరకు తన ఓటమిని ఇల్తిజా అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. తన గెలుపు కోసం కష్టపడిన పీడీపీ కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.కాగా, జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి హవా కొనసాగిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ను దాటి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం 90 స్థానాలకు గానూ నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి 52 స్థానాలతో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. బీజేపీ 26 స్థానాల్లో ముందంజలో ఉంది. పీడీపీ నాలుగు స్థానాల్లో, ఇతరులు ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉన్నారు.