ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్కు ‘ఆపరేషన్ సిందూర్’ తో గట్టి బుద్ధి చెప్పింది. భారత్ చేపట్టిన ఈ దాడితో పాక్కు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఆపరేషన్లో తనకు జరిగిన నష్టాన్ని పాక్ తాజాగా వెల్లడించింది. భారత్ జరిపిన దాడిలో 11 మంది సైనికులు మరణించి నట్లు తాజాగా వెల్లడించింది. మృతుల్లో ఆరుగురు పాక్ ఆర్మీకి చెందిన వారు కాగా, ఐదుగురు వైమానికి దళానికి చెందిన వారని తెలిపింది. ఇక ఈ దాడిలో మరో 78 మంది గాయపడినట్లు వెల్లడించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్లో 40 మంది పౌరులు చనిపోగా.. 121 మంది గాయపడినట్లు పేర్కొంది. ఈమేరకు ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్పీఆర్ ఓ ప్రకటన విడుదల చేసింది. మరణించిన సైనికుల పేర్లను కూడా పాక్ వెల్లడించింది. ఆర్మీకి చెందిన నాయక్ అబ్దుల్ రెహమాన్, లాన్స్ నాయక్ దిలావర్ ఖాన్, లాన్స్ నాయక్ ఇక్రముల్లా, నాయక్ వకార్ ఖలీద్, సిపాయ్ ముహమ్మద్ అదీల్ అక్బర్, సిపాయ్ నిసార్ మరణించినట్లు తెలిపింది. ఇక వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటనలో వెల్లడించింది. అయితే, తమ దాడిలో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మరణించి ఉంటారని భారత్ ఇటీవలే తెలిపిన విషయం తెలిసిందే. 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు ప్రకటించింది.