అల్ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామ బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్ను మట్టుబెట్టినట్లు అమెరికా భద్రతా దళాలు ప్రకటించాయి.2001 సెప్టెంబర్11వ తేదీన అమెరికా ట్విన్ టవర్స్ను విమానాలతో పేల్చేసినందుకు పదేళ్ల పాటు లాడెన్ కోసం వేట సాగించిన అమెరికన్ సీల్స్ దళాలు 2011లో ముగ్గురు భార్యలతో పాకిస్థాన్లోని అబోత్తాబాద్ ఇంట్లో ఉండగా బిన్లాడెన్ను చుట్టుముట్టి దాడి చేశాయి.దాడిలో లాడెన్తో పాటు అతడి కొడుకు ఖాలిద్ మృతి చెందగా హంజా తృటిలో తప్పించుకున్నాడు.అనంతరం అల్ఖైదా చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన హంజా తన తండ్రి హత్యకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటానని అమెరికాను హెచ్చరించాడు. ఈ క్రమంలో అమెరికా హంజా కోసం ఎంతగా గాలిస్తున్నా స్థావరాలు మార్చుతూ హంజా తప్పించుకుంటూ వచ్చాడు.2016 జులైలో హంజా అమెరికాను హెచ్చరిస్తూ ఓ ఆడియో విడుదల చేశాడు. తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు.హంజా హెచ్చరికలు, అతని ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఆస్తులను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. 2016 నుంచి హంజా కోసం అగ్రరాజ్యం వేట కొనసాగిస్తూనే ఉంది. హంజా నేతృత్వంలో అల్ ఖైదా కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో హంజా ఆచూకీ చెప్పినా అతన్ని పట్టిచ్చినా భారీ మొత్తాన్ని ఇస్తామని అమెరికా ఫిబ్రవరిలో ప్రకటించింది. మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది.హంజా బిన్ 2018లో చివరిసారి మీడియాకు ఓ వీడియో విడుదల చేశాడు. అందులో సౌదీ అరేబియాను బెదిరించాడు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చాడు. 2007లో పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యలో హంజా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.మూడేళ్ల అనంతరం ఎట్టకేలకూ అమెరికా ప్రయత్నం ఫలిచింది. అమెరికా చేసిన దాడిలో హంజా బిన్ లాడెన్ హతమైనట్లుయూఎస్ ఇంటలిజెన్స్ ప్రకటించింది. హంజాను అంతమొందించినట్లు ప్రకటించిన అమెరికా అతన్ని ఎక్కడ మట్టుబెట్టారన్న విషయం మాత్రం వెల్లడించలేదు.