రైతును కోటీశ్వరుడిని చేసిన ఉల్లి..

రైతును కోటీశ్వరుడిని చేసిన ఉల్లి..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల్లో పెరిగిన ఉల్లి ధరల గురించి తప్పనిసరిగా ప్రస్తావన ఉంటుంది.అంతగా ప్రజలను భయపెడుతున్న ఉల్లి కర్ణాటకలో ఓ రైతును మాత్రం రోజుల వ్యవధిలో కోటీశ్వరుడిని చేసింది. చిత్రదుర్గ జిల్లా దొడ్డసిద్దవ్వనహళ్లికి చెందిన మల్లిఖార్జున.. 20 ఎకరాల పొలంలో ఉల్లి సాగు చేశాడు. ఈసారి మార్కెట్‌లో విపరీతమైన రేటు ఉండడంతో అతని పంట పండింది. ఇప్పటివరకూ 240 టన్నులు విక్రయించడంతో రూ.4.50 కోట్ల వరకూ ఆదాయం వచ్చింది.కొద్ది రోజులుగా ఉల్లి ధర రూ.200కు పైగానే నమోదవుతున్న నేపథ్యంలో మల్లికార్జునకు బాగా కలసివచ్చింది. అతను ఈ స్థాయిలో డబ్బు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో రేటు దాదాపు 200 వరకూ ఉండడం కలిసొచ్చింది. చుట్టుపక్కల మరికొందరు రైతులు కూడా ఉల్లి సాగుచేసినా ఎవరికీ ఇంతలా ఆదాయం రాలేదు. దిగుబడి బాగా ఉండడం, ధర కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఉండడంతో మల్లిఖార్జున సుడి తిరిగింది.కొన్నేళ్లుగా ఉల్లి పంట మీద ఆదాయం పెద్దగా లేకపోవడంతో ఈసారి అప్పుచేసి మరీ పెట్టుబడి పెట్టాడు. తనకు ఉన్న పది ఎకరాల పొలంతోపాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాడు. ఈసారి దశ తిరిగి నెల రోజుల్లోనే కోట్లకు పడగలెత్తాడు. ప్రస్తుతం తన అప్పులు తీరిపోయాయని, వచ్చిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంటానని అలాగే మరికొంత వ్యవసాయ పొలం కూడా కొనుక్కుంటానంటున్నాడు.ఏటా ఉల్లి సాగు చేసినప్పుడు దిగుబడి బాగా వచ్చినా ఐదు లక్షలకు మించి మిగులు ఉండదని ఈసారి కూడా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో మిగిలితే చాలనుకున్నానని కానీ అనూహ్యంగా పెరిగిన రేట్లతో తన కుటుంబం దశ మారిపోయిందంటున్నాడు.ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదని సామెత మల్లికార్జున విషయంలో రుజువైందని స్థానికులు చెప్పుకొంటున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos