జనసేనాని మాటలు,చర్యలు చూస్తుంటే బీజేపీకి దగ్గరవుతున్నారేమోన్న అనుమానాలను మరింత బలపడేలా చేస్తున్నాయి.గతంలో ఇదే బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన పవన్ కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.రాయలసీమ పర్యటనలో కొన్ని సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను ప్రశంసించడమే కాదు, ఆర్ఎస్ఎస్నే సైతం తన ప్రసంగంలో ప్రస్తావించారు.తాజాగా మన ప్రియమైన ప్రధానమంత్రి, గౌరవనీయ నరేంద్ర మోదీ అంటూ సంబోధిస్తూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. “సాయుధ బలగాల కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్రీయ సైనిక్ బోర్డుకు ఉదారంగా విరాళాలు ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు మనమందరం సంఘీభావం ప్రకటించాలి” అంటూ పవన్ ట్వీట్ చేశారు.సాయుధ బలగాల పతాక దినోత్సవం పురస్కరించుకుని పవన్ ఈమేరకు పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే కాదు, తనవంతుగా సైనిక సంక్షేమ నిధికి రూ.1 కోటి విరాళం ప్రకటించారు. తానే స్వయంగా చెక్కులను దీనికి సంబంధించిన అధికారులకు ఇస్తానని తెలిపారు. ఈ విషయంలో దేశం కోసం పౌరుల బాధ్యతను గుర్తుచేస్తున్న ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.