హైదరాబాద్: కార్మికుల వేతనాల చెల్లింపునకు అవసరమైన నిధులు తమ వద్ద లేవని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. జీతాల కోసం రూ.230 కోట్లు అవసరమని, ప్రస్తుతం తమ వద్ద ఉన్నది రూ.7.5 కోట్లు మాత్రమేనని వివరించింది. కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని పేర్కొంది. చేసిన పనికి వేతనం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ వారి ప్రాథమిక హక్కులకు ఆర్టీసీ యాజమాన్యం భంగం కలిస్తోందంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. జీతాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాలు వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.