న్యూఢిల్లీ: దేశ ఉన్నత విద్యా వ్యవస్థలో జరిగిన భారీ అవినీతి బయటపడింది. ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ) అనుకూల గ్రేడ్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే డబ్బులు తీసుకుని నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వంటి ఘటనలు మరవక ముందే మళ్లీ నాక్ గ్రేడ్ కోసం కోట్ల రూపాయాల డబ్బులను డిమాండ్ చేయడం బయటపడింది. జనవరి 26న దేశ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో జేఎన్యూ ప్రొఫెసర్ రాజీవ్ సిజారియా ఒక ప్రయివేట్ యూనివర్సిటీకి నాక్ తనిఖీ నివేదికను తారుమారు చేయడానికి క్యాంపస్లోని తన నివాసంలో లంచం కోసం చర్చలు జరిపారు. అనుకూలమైన అక్రిడిటేషన్ గ్రేడ్ ఇవ్వడానికి నాక్ బృందం సభ్యులు ఆంధ్రప్రదేశ్లోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కేఎల్ఈఎఫ్) నుంచి రూ.1.8 కోట్లు డిమాండ్ చేశారు. చర్చల తర్వాత, రూ.28 లక్షలకు ఒప్పందం ముగిసింది. ప్రొఫెసర్ రాజీవ్ సిజారియా ప్రధాన వాటాను సొంతం చేసుకున్నారు. సీబీఐ.. సోదాలు నిర్వహించి కేసు నమోదు చేసింది. ప్రొఫెసర్ సిజారియాతో సహా మొత్తం పది మందిని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈ నెల ప్రారంభంలో నాక్ కమిటీ చైర్మెన్, రామచంద్ర చంద్రవంశీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సమేంద్ర నాథ్ సాహా, నాక్ సభ్యులు రాజీవ్ సిజారియా, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా డీన్ డి. గోపాల్, జాగ్రన్ లేక్సిటీ విశ్వవిద్యాలయం డీన్ రాజేష్ సింగ్ పవార్, జిఎల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మానస్ కుమార్ మిశ్రా, దావణగెరె విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గాయత్రి దేవరాజా, సంబల్పూర్ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ బులు మహారాణా, కెఎల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ జిపి సారధి వర్మ, మరో ఇద్దరు ఆఫీస్ బేరర్లతో సహా మొత్తం పది మందిని సీబీఐ అరెస్టు చేసింది. గుంటూరులోని కెఎల్ యూనివర్సిటీను ఐదేండ్ల పాటు అక్రిడిటేషన్ నుంచి నిషేధించారు. అనిల్ సహస్రబుద్ధే నేతృత్వంలోని నాక్ కార్యనిర్వాహక కమిటీ రెండ్రోజుల క్రితం అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నాక్ కమిటీలోని ఏడుగురు సభ్యులపై కూడా జీవితకాలం పాటు నాక్, ఇతర కార్యకలాపాలలో నిషేధం విధించారు. నాక్ తనిఖీ బృందం సభ్యులకు అనుకూలమైన గ్రేడ్ కోసం లంచం ఇచ్చినందుకు సీబీఐ.. కెఎల్ యూనివర్శిటీ ఆఫీస్ బేరర్స్ను అరెస్టు చేసిన తర్వాత, ఆ సంస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 2018లో ఈ యూనివర్శిటీ నాక్ ‘ఎంం’ గ్రేడ్లో అత్యధిక స్కోరును సాధించింది. 2013లో లభించిన ఎ గ్రేడ్ కంటే అప్పుడు రెండు గ్రేడ్లు ఎక్కువగా ఉంది. మళ్లీ ఇప్పుడు ఇప్పుడు నాక్ కెఎల్ యూనివర్సిటీని సందర్శిం చాల్సి ఉంది. 2024-29 కాలానికి నాక్ ”పున్ణ గుర్తింపు” కోసం జనవరి 29 నుంచి 31 వరకు నాక్ ఇన్స్టిట్యూట్ తనిఖీకి షెడ్యూల్ చేశారు.