హొసూరు : తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఎంజీఆర్ 103వ జయంతి వేడుకలను ఏడీఎంకే పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా హొసూరు సమీపంలోని బాగలూరులో పంచాయతీ అధ్యక్షుడు వీడీ. జయరాం అధ్యక్షతన బస్టాండులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి బాలకృష్ణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంజీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తరువాత మహిళలకు చీరలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళ సినీ పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన ఎంజీ రామచంద్రన్ ఏడీఎంకే పార్టీని స్థాపించి, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఎంజీఆర్ స్థాపించిన పార్టీని కార్యకర్తలు కాపాడుకుంటూ వస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో
ఏడీఎంకే పార్టీ విజయ దుందుభి మోగించిందని అంటూ, రానున్న కార్పొరేషన్ ఎన్నికలలో కూడా హొసూరు ఏడీఎంకే పార్టీ ఖాతాలో పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హొసూరు యూనియన్ చైర్పర్సన్ శశి వెంకట స్వామి, యూనియన్ వైస్ చైర్మన్ నారాయణస్వామి, బాగలూరు పంచాయతీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, యూనియన్ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.