హొసూరు : ఇక్కడి శైవ క్షేత్రాలలో శుక్రవారం మహా శివరాత్రి పూజలు ఘనంగా నిర్వహించారు. హొసూరులో సుప్రసిద్ధ దేవాలయంగా పేరు పొందిన చంద్ర చూడేశ్వర స్వామి ఆలయం, స్థానిక రామ్ నగర్లోని త్రిలింగేశ్వర ఆలయంతో పాటు పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లో గల శైవ క్షేత్రాలలో ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కెలమంగలం సమీపంలో అతి పురాతన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన శివ నంజుండేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి వివిధ రకాల అభిషేకాలు, విశేష పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దైవ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారనే అంచనాతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం తాగు నీటి సౌకర్యం కల్పనతో పాటు ప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు చేపట్టారు.