కాశ్మీర్:ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ సైనిక పోస్టులకు అత్యంత సమీపంలో ఉన్న సలోత్రి గ్రామంలో ప్రజలు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో వారు తమ భూగర్భ బంకర్లను శుభ్రం చేసుకుని, నిల్వలు సిద్ధం చేసుకుంటున్నారు.గత రెండు రోజులుగా పాకిస్తాన్ బలగాలు ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయి. చిన్న ఆయుధాలతో భారత స్థావరాలపై కాల్పులకు పాల్పడుతున్నాయని, దీనికి భారత సైన్యం “గట్టిగా, సరైన రీతిలో” బదులిస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.ఈ నేపథ్యంలో సలోత్రి గ్రామస్థులు తమ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించిన బంకర్లపై ఆధారపడుతున్నారు. బంకర్లు చాలా పటిష్టంగా ఉన్నాయని, తమకు రక్షణ కల్పిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. “సుమారు 10 అడుగుల లోతులో, బుల్లెట్ప్రూఫ్గా నిర్మించిన ఈ బంకర్లలో మాకు ఎలాంటి ప్రమాదం లేదు. ” అని ఓ గ్రామస్థుడు పేర్కొన్నాడు. పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయకులను చంపడం పిరికిపంద చర్య అని, దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు అంటున్నారు. ప్రతీకార చర్యలు మొదలైతే, తమ భద్రత తాము చూసుకోవాలని, అందుకే బంకర్లను సిద్ధం చేసుకుంటున్నామని వారు తెలిపారు. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో పొరుగున ఉన్న హుందర్మాన్ గ్రామస్థులు చిన్న బంకర్లలో తలదాచుకోగా, సలోత్రి వాసులకు ఆ సౌకర్యం లేక పూంచ్ పట్టణానికి వలస వెళ్లాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ప్రభుత్వ బంకర్ల వల్ల ఎంతటి ఘర్షణ వాతావరణంలోనైనా తమ గ్రామంలోనే సురక్షితంగా ఉండగలమన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది.