మళ్లీ చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు

మళ్లీ చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు

తిరుమల: తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలవరపెడుతున్నది. జూ పార్క్‌ రోడ్డు నుంచి తిరుమల టోల్‌ గేటు మీదుగా చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్తూ కనిపించింది. చిరుత సంచారం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఇటీవల తిరుమలలో చిరుత సంచారం ఎక్కువైంది. రెండు వారాల కిందట కూడా చిరుత సంచరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో భక్తుల రక్షణ కోసం టీటీడీ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. అలాగే చిరుతను పట్టుకునేందుకు తిరుపతి వేదిక్‌ యూనివర్సిటీ దగ్గర ఓ బోన్‌ ఏర్పాటు చేశారు. అక్కడ వారికి చిరుత దొరికింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి చిరుత కనిపించడంతో భయాందోళన చెందుతున్నారు. కాగా, చిరుతల పర్యవేక్షణకు ఒక ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయడానికి ఏపీ అటవీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. శాటిలైట్‌, జీపీఎస్‌, అధునాతన కెమెరాల వంటి వ్యవస్థలతో చిరుతల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అటవీ మ్యూజియం ఉన్న భవనంలోనే ఈ సెల్‌ను ఏర్పాటుచేయనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos