బెంగళూరు: రాష్ట్రంలో రూ.59,350 కోట్ల అంచనా వ్యయంతో పరిశ్రమల స్థాపనకు, వ్యాపారాల్ని ఆరంభించేందుకు పాతిక సంస్థలతో ద్యావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో అవగాహన ఒప్పందాల్ని కుదర్చుకున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు.ద్యావోస్ నుంచి తిరిగి వచ్చిన ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. రెన్యూ పవర్ సంస్థ ఏడేళ్ల వ్యవధిలో రెండు దశల్లో విద్యుత్ ఉత్పత్తికి రూ.యాభై కోట్లు వ్యయం చేయనుంది. దీని వల్ల కనీసం ముప్పయి వేల మందికి ఉపాధి లభిస్తుంది. లూలూ సంస్థ రూ. రెండు వేల కోట్లతో నాలుగు మాల్స్ ఆరంభించనుంది. ఇంకా జుబిలియంట్ గ్రూప్, హిటాచి, సీమెన్స్, ఏబీ ఇన్వెబ్, డసాల్ట్, నెస్లే, ఆర్సెలర్ మిట్టల్, భార్తీ ఎంటర్ ప్రైజెస్, తదితర సంస్థలు పెట్టు బడులు పెట్టే్ందుకు అంగీకరించాయని చెప్పారు. దక్షిణాదిలోకెల్లా పరిశ్రమల్ని తమ రాష్ట్రమే అధికంగా ఆకర్షిస్తోందని వివరించారు. కర్నాటక కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రూ లక్ష ఇరవై కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాయనే వాదనలో నిజం లేదన్నారు. అవగాహన ఒప్పందాలు కుదరిన వాటినే తాము ప్రకటించామని చెప్పారు. సంప్రదింపులు జరిగిన సంస్థల ప్రతిపాదిత పెట్టుబడుల్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. వాటినీ లెక్కలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ పెట్టుబడులు కర్నాటకలోకే ప్రవహించాని గణాంకాలతో విపులీకరించారు.