టెస్టు టెస్టుకు మార్పులా…!

  • In Sports
  • February 25, 2020
  • 137 Views

వెల్లింగ్టన్‌ : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాకు తొలి ప్రపంచకప్‌ అందించిన సారథి కపిల్‌ దేవ్‌ టెస్టు ఓటమిపై స్పందిస్తూ పలు ప్రశ్నల వర్షం కురిపించాడు. వన్డే, తొలి టెస్టుల్లో కివీస్‌ ఆడిన తీరు అమోఘం. ఓటమి తర్వాత వారు పుంజుకున్న విధానం, సారథిగా విలియమ్సన్‌ ముందుండి నడిపించే వైఖరి నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. టీమిండియా విషయానికి వస్తే మేనేజ్‌మెంట్‌ను పలు ప్రశ్నలు అడగదల్చుకున్నా. ప్రతీ మ్యాచ్‌కు కొత్త జట్టా? పదకొండు మందితో కూడిన ఓ జట్టును వరుసగా మ్యాచులు ఆడించరా? ప్రతీ మ్యాచ్‌ కోసం జట్టులో మార్పులు చేస్తునే ఉంటారా? ఇలా మార్చుకుంటూ వెళ్లడం ద్వారా యువ ఆటగాళ్లకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారు? గత కొంతకాలంగా సీనియర్‌ ప్లేయర్స్‌ మినహా ఏ ఒక్క యువ ఆటగాడినైనా జట్టులో శాశ్వత స్థానం కల్పించారా? జట్టులో తన స్థానంపై నమ్మకం లేనప్పుడు ఆ ఆటగాడు మెరుగైన ప్రదర్శన ఏలా చేయగలడు?’అంటూ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను కపిల్‌దేవ్‌ ప్రశ్నించాడు. ‘బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌ ఉన్నా తొలి టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో కూడా 200 పరుగులు చేయకపోవడం హాస్యాస్పదంగా ఉంది. ప్రతీసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. కొన్ని సార్లు పోరాడి జయించాలి. అంతేకాని పరిస్థితులకు దాసోహం కాకూడదు. తుది జట్టును ఎంపిక చేసేముందు ఆటగాడికి బలమైన నమ్మకాన్ని ఇవ్వాలి. ఈ విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తనను తాను ప్రశ్నించుకోవాలి. ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ను టెస్టు జట్టులోకి తీసుకోలేదు. టీ20, వన్డేల్లో పరుగులు రాబట్టిన ఆటగాడిని పక్కన కూర్చోబెట్టడంలో ఏమైనా అర్థం ఉందా? ఫామ్‌లో ఉన్న ఆటగాడిని ఆడించడం జట్టుకు, ఆ క్రికెటర్‌కు ఎంతో లాభం’ అంటూ కపిల్‌ దేవ్‌ పేర్కొన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos