శ్రీనగర్ : ప్రపంచ కప్పులో ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో భారత్ ఓటమికి ఆటగాళ్లు ధరించిన జెర్సీనే కారణమని జమ్ము, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. తనకు మూఢనమ్మకం ఎక్కువ అని అనుకున్నా ఫర్వాలేదు కానీ, మన జైత్రయాత్రకు కొత్త జెర్సీనే కళ్లెం వేసిందని పేర్కొన్నారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలని, మనతో పాటు పాకి అభిమానులు కూడా కోరుకున్నారని తెలిపారు. కనీసం క్రికెట్లోనైనా ఇరు దేశాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఇండియా ఓటమిపై మరో విధంగా స్పందించారు. భారత్ ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ సెమీఫైనల్ చేరడానికి ఈ మ్యాచే కీలకమై ఉంటే మన ఆటగాళ్ల ప్రదర్శన ఇలాగే ఉండేదా అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.