హొసూరు : ఇక్కడికి సమీపంలోని బాగలూరులో అనాథలకు బాగలూరు పంచాయతీ అధ్యక్షులు వీడీ. జయరామ్ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కరోనా దెబ్బకు పట్టణాలు, గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 14 వరకు 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో దుకాణాలు హోటళ్లు మూతపడ్డాయి. ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. హోటళ్లు మూతపడడంతో అనాథలకు భోజనం దొరకడం కష్టమైంది. బాగలూరులో దుకాణాలు, హోటళ్లు మూతపడడంతో అనాథ వృద్ధులకు ఆహారం, నీరు దొరకడం లేదు. భిక్షాటనకు వెళితే, ఎవరూ రానివ్వడం లేదు. దీంతో వృద్ధుల అవస్థలు వర్ణనాతీతం.
అలాంటి వారి ఆకలి తీర్చడానికి బాగలూరు పంచాయతీ అధ్యక్షులు వీడీ. జయరామ్ నడుం బిగించారు. అన్నదానం చేసి తన ఉదారతను చాటుకున్నారు. బాగలూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో తిరుగుతున్న వృద్ధులకు రెండు పూట్లా కడుపు నిండా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చారు. గత మూడు రోజులుగా వారికి ఆహారం,నీరు అందిస్తూ పట్టణ ప్రజల ప్రశంసలు అందుకున్నారు.