కోల్కతా : ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారిగా డార్జిలింగ్ కొండలపై శుక్రవారం ఏకంగా పది కి.మీలు ఉత్సాహంగా జాగింగ్ చేశారు. ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లైమేట్ యాక్షన్’ సందర్భంగా జాగింగ్ చేసి ఆదర్శంగా నిలిచారు. డార్జిలింగ్లోని కూర్సే యాంగ్ నుంచి జాగింగ్ ఆరంభించిన ఆమె మార్గ మధ్యంలో స్థానికులను పలకరించారు. పర్యావరణ పరిరక్షణ, కర్భన ఉద్గారాల నియంత్రణ వంటి అంశాలను వారితో ప్రస్తావించారు. మమత వెంట భద్రతా సిబ్బంది, పలువురు జర్నలిస్టులు ఉన్నారు. సంబంధిత వీడియోను మమత సామాజిక మాధ్యమాల్లో ఎక్కించారు. ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లైమేట్ యాక్షన్ సందర్భంగా మన భూ గ్రహాన్ని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిఙ్ఞ చేద్దాం. పచ్చదనాన్ని కాపాడండి. పరిశుభ్రంగా ఉండండ’ని పిలుపు నిచ్చారు.