ఓవల్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది. టీమిండియా విజయానికి చేరువగా ఉంది. మరో నాలుగు వికెట్లు పడగొడితే 50 ఏళ్ల నిరీక్షణకు తెర పడుతుంది. ఇంగ్లండ జట్టు గెలుపు కోసం ఇంకా 219 పరుగులు చేయాల్సి ఉంది. అదంత సులభం కాదు. మహా అంటే…ఆ జట్టు డ్రాకు ప్రయత్నించవచ్చు. ఓవల్లో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో గెలిచింది. ఆ మ్యాచులో అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయం.
ఆ తర్వాత టీమిండియా 8 మ్యాచులు ఆడినా ఒక్క మ్యాచులోనూ విజయం సాధించలేకపోయింది. వరుసగా 5 మ్యాచులను డ్రా చేసుకున్న భారత జట్టు గత మూడు పర్యటనల్లో(2011, 2014, 2018) ఘోర పరాజయాలను చవి చూసింది. 2011లో ఇన్నింగ్స్, 8 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. 2014 టూర్లో ఇన్నింగ్స్ 244 పరుగుల తేడాతో చిత్తయింది. 2018 పర్యటనలో 118 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.