పాకిస్థాన్ లో 1996లో వరల్డ్ కప్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు అక్కడ మరో ఐసీసీ టోర్నీ జరగలేదు. ప్రధానంగా ఉగ్రవాదం కారణంగా విదేశీ జట్లు పాక్లో పర్యటించేందుకు భయపడుతుండడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. 2025లో జరిగే పురుషుల చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాక్కు కట్టబెట్టింది. 29 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై జరగనున్న ఐసీసీ టోర్నీ ఇదే. చివరిసారిగా 1996లో పాకిస్థాన్… భారత్, శ్రీలంకలతో కలిసి వన్డే వరల్డ్ కప్ నిర్వహించింది.
తాజాగా, ఐసీసీ తన మేజర్ టోర్నమెంట్ల వేదికలను నేడు ఖరారు చేసింది. ఆసక్తికర రీతిలో అమెరికా కూడా వరల్డ్ కప్కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకుంది. 2024లో పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆమెరికా వేదికగా జరగనుంది. ఈ టోర్నీని అమెరికా, వెస్టిండీస్ దేశాల క్రికెట్ బోర్డులు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
2026లో భారత్, శ్రీలంక దేశాల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అంతేకాదు, నమీబియా వంటి దేశానికి వన్డే వరల్డ్ కప్ నిర్వహించే అవకాశాన్ని ఐసీసీ కల్పించింది. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ పోటీలు దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో పాటు నమీబియాలోనూ జరగనున్నాయి. 2028 టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనున్నాయి.
2029లో చాంపియన్స్ ట్రోఫీ భారత్లో జరగనుండగా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ దేశాలకు 2030లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించే చాన్స్ దక్కింది. 2031లో భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా పురుషుల వరల్డ్ కప్ కు వేదికగా నిలవనున్నాయి.