హోసూరు : భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేసిన భర్త పోలీసులకు లొంగిపోయాడు. హోసూరు లక్ష్మీనారాయణ నగర్కు చెందిన మణికంఠన్ భార్య సింధూజ. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. మణికంఠన్ అత్తగారి ఇంట్లోనే ఉంటూ హోసూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. గత ఆరు నెలలుగా భార్యపై అనుమానంతో తరచూ గొడవపడేవాడు. రోజురోజుకు అనుమానం పెనుభూతమై భార్యను హత్య చేయాలని నిర్ణయించుకొని దుకాణంలో కత్తిని కొనుగోలు చేసి పడక గదిలో దాచుకొన్నాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సింధూజాతో గొడవపడిన మణికంఠన్, పథకం ప్రకారం తాను దాచుకున్న కత్తితో భార్య గొంతుకోసి దారుణంగా హత్య చేసి హోసూరు హడ్కో పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు శవాన్ని స్వాధీన పరచుకొని హోసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.