హోసూరు : స్థానిక పూల వ్యాపారులు తాత్కాలికంగా ప్లైవోవర్ కింద ఏర్పాటు చేసుకున్న దుకాణాలను అధికారులు ఖాళీ చేయించారు. హోసూరు పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనాను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా హోసూరులో గత మూడు నెలలుగా పూల మార్కెట్లను మూసి వేయించారు. పట్టణంలో రెండు చోట్ల నిర్వహిస్తున్న పూల మార్కెట్లు మూతపడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొద్ది రోజులకు పూల వ్యాపారులు హోసూరు బస్టాండు ఎదురుగా ఉన్న ప్లైవోవర్ కింద తాత్కాలికంగా దుకాణాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహించేవారు. ఈ పూల మార్కెట్ వల్ల హోసూరు పట్టణంలో కరోనా మరింతగా ప్రబలే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజులు పూల మార్కెట్ను మూసివేయించాలని స్థానికులు అధికారులను డిమాండ్ కూడా చేశారు. దీంతో ఫ్లైవోవర్ దిగువ నిర్వహిస్తున్న పూల మార్కెట్ను మూసేశారు. దీనివల్ల వ్యాపారులతో పాటు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.