గత కొంతకాలంగా ‘గ్రీన్ ఛాలెంజ్‘ హవా నడుస్తోంది. పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటాలనే సదుద్దేశంతో నడుస్తున్న ఈ ఛాలెంజ్ని పలువురు సెలెబ్రిటీలు సాదరంగా స్వాగతిస్తున్నారు. ఇప్పటికే ఎందరో సినీరాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమై మొక్కలు నాటిన సంగతి తెలిసిందే.ఇదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో సినీ నటి, ఎమ్మెల్యే రోజా.. ‘రోజా వనం‘ అనే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా బహుభాష హీరో,నటుడు అర్జున్ను కలసిన రోజా అర్జున్తో కలసి మొక్కలు నాటారు.మొక్కలు నాటిన అనంతరం అర్జున్ మరో ముగ్గురిని నామినేట్ చేశారు.బహుభాష నటుడు జగపతిబాబు, ప్రముఖ దర్శకుడు రోజా భర్త ఆర్కే సెల్వమణి, నటి ఖుష్బూలను నామినేట్ చేస్తూ ఛాలెంజ్ విసిరారు.‘భవిష్యత్ తరాలకు మేలు కలిగేలా, భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలనే రోజా సంకల్పం చాలా గొప్పది. ఆమె ఇలా మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజావనంలో జగపతిబాబు, ప్రముఖ దర్శకుడు, రోజా భర్త ఆర్కే సెల్వమణి, నటి ఖుష్బూ పాల్గొనాలని వారికి ఛాలెంజ్ విసురుతున్నాను” అని అర్జున్ తెలిపారు.ఇక తెరాస ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ రోజు రోజుకూ విస్తరిస్తుండటం గమనార్హం..