హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నది. బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేస్తున్నది. ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని వేదిక విజ్ఞప్తి చేసింది. కార్మిక, రైతు, కార్మిక, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేంద్రం బడ్జెట్లో భారీ కోతలు పెట్టింది. ముఖ్యంగా కార్మికులకు నెలకు వేతనం రూ. 26వేలు ఇవ్వాలనే డిమాండ్ను పట్టించుకోలేదు. ఉపాధి కూలీలకు బడ్జెట్ కేటాయింపుల్లో కోత పెట్టి ఆయా వర్గాలను ఉపాధికి దూరం చేస్తున్నది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించి, రైతులను కూలీలుగా మార్చేందుకు కేంద్ర బడ్జెట్ను ఉపయోగించింది. మైనార్టీ, దళిత, గిరిజనుల అభివృద్ధిని నిర్వీర్యం చేసేలా బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఈనేపథ్యంలో బడ్జెట్లో సవరణలు చేయాలనే డిమాండ్తో నేడు మహాధర్నాకు ప్రజాసంఘాల పోరాట వేదిక పిలుపునిచ్చింది. సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, కేవీపీఎస్, టీజీఎస్, ఆవాజ్, తెలంగాణ వృత్తిసంఘాల సమన్వయ కమిటీ, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీఎన్ఎం, పట్నం, ఆదివాసీ గిరిజన సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో ఈ మహాధర్నా జరుగుతున్నది.