హొసూరు : ఇక్కడికి సమీపంలోని డెంకణీకోట అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారంతో రైతులు హడలిపోతున్నారు. దాదాపు 15 ఏనుగులు ఇక్కడ సంచరిస్తున్నాయి. ఈ ఏనుగులు హొసూరు సమీపంలోని సానమావు అటవీ ప్రాంతానికి చేరుకునే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హొసూరు సమీపంలోని కెలవరపల్లి డ్యామ్ ఆయకట్టు ప్రాంతమైన పాతకోట రామాపురం, పోడూరు, పేరండపల్లి ప్రాంతాలలో ప్రస్తుతం వరి పంట కోత దశకు చేరుకుంది. డెంకణీకోట అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న 15 ఏనుగుల మంద హొసూరు ప్రాంతానికి చేరుకుంటే వరి పంటలు నాశనమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జవులగిరి అటవీ ప్రాంతం నుంచి డెంకణీకోట అటవీ ప్రాంతానికి వచ్చిన 15 ఏనుగుల మందను మళ్లీ వెనక్కు తరిమివేసి రైతుల పంటలను కాపాడడానికి అటవీ శాఖ అధికారులు త్వరగా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు అధికారులను కోరుతున్నారు.