పూణె : అడవి అగ్నికి ఆహుతి కాకుండా నటుడు సాయాజీ షిండే తీసుకున్న చర్యలకు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. పూణె శివార్లలో ఉన్న కాట్రాజ్ కనుమ దారిలో ఆదివారం ఆయన కారులో ప్రయాణిస్తున్నపుడు అడవి తగలబడటాన్ని గమనించారు. వెంటనే కారు ఆపి అడవి తగలబడుతున్న ప్రదేశానికి వెళ్లారు.దగ్గరలో నీళ్లు లేకపోవడంతో పచ్చి తుప్పలు పట్టుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు ఎగసిపడుతున్నా వెనకడుగు వేయలేదు. ఆయనకు ఆ తర్వాత కార్పొరేటర్ రాజేష్ బరాతే కలవడంతో ఇద్దరూ కలిసి కష్టపడి మంటలను అదుపు చేసి పెను ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. నెటిజన్లు షిండేపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు.