హొసూరు : రాష్ట్రంలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో డీఎంకే పార్టీకే ప్రజలు పట్టం కడతారని హొసూరు ఎమ్మెల్యే ఎస్ఏ. సత్య ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి మీరా మహల్ కళ్యాణ మంటపంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. హొసూరు మేయర్ పదవితో పాటు ఎక్కువ సంఖ్యలో కౌన్సిలర్ స్థానాలను డీఎంకే పార్టీ గెలుచుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. హొసూరు పట్టణ మేయర్ పదవిని
డీఎంకే అభ్యర్థి చేజిక్కించుకోవడం ద్వారా చరిత్ర సృష్టించడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో డీఎంకే హయాంలో హొసూరు చైర్ పర్సన్ గా తాను పదవిలో ఉన్నప్పుడు పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులను నిర్వహించామని గుర్తు చేశారు. కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తే సునాయాసంగా మేయర్ పదవిని చేజిక్కించుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంకే జిల్లా అధ్యక్షుడు వై. ప్రకాష్, ఎమ్మెల్యే మురుగన్, పార్టీ నాయకులు సుకుమార్, ఆగ్రో నాగరాజ్, యువరాజ్, విజయకుమార్, మాదేశ్వరన్ చెన్నీరప్ప, విజి. నాగరాజ్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.