న్యూఢిల్లీ : మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ జూన్ 26న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) ఇచ్చిన ‘సేవ్ అగ్రికల్చర్, సేవ్ డెమోక్రసీ’ ఆందోళనకు సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్టియుసి, హెచ్ఎంఎస్, ఎఐయుటియుసి, టియుసిసి, ఎఐసి సిటియు, యుటియుసి, ఎల్పిఎఫ్, ఎస్ఇడబ్ల్యుఎ సంఘాలు మద్ధతు ప్రకటించాయి. ‘దేశం సంఘీభావం’ పేరుతో ఆందోళనకూ పిలుపు ఇచ్చాయి. ఢిల్లీలోకి వెళ్లే ప్రధాన రహదారులపై రైతుల ఆందోళన 200 రోజులుగా నిరంతరం కొనసాగుతోంది. ఈ క్రమంలో 500కు పైగా రైతు సోదరులను కోల్పోయారు. తీవ్రమైన చలి, ఎండ, వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఆందోళన కొనసాగిస్తున్నారని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. జూన్ 26న దేశవ్యాప్తంగా జిల్లా, మండల స్థాయి నిరసనలతో పాటు రాష్ట్రాల్లోని రాజ్ భవన్ల వద్ద ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపు ఇచ్చాయి.