బెంగళూరు : ఇక్కడికి సమీపంలోని దేవర చిక్కనహళ్లి ఆశ్రిత్ అపార్ట్మెంట్లో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లీ కుమార్తెలు సజీవ దహనమయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటల్లో చిక్కుకుని ఇద్దరూ మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులను లక్ష్మీదేవి (80), ఆమె కుమార్తె భాగ్య రేఖ (59)లుగా గుర్తించారు. సోమవారమే వారిద్దరూ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఫైరింజన్ సిబ్బంది పూర్తిగా కాలిపోయిన ఆ ఇద్దరి మృతదేహాలను రాత్రి సమయానికి బయటకు తీసుకురాగలిగారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్లో చిక్కుకున్న మహిళ సజీవ మరణానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఓ ఫ్లాట్లో సిలిండర్ పేలుడే ఈ ఘటనకు కారణమని.. క్షణాల్లోనే ఇతర ఫ్లాట్లకు మంటలు వ్యాపించాయని స్థానికులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన పలువురిని ఆసుపత్రికి తరలించామని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని అగ్నిమాపక దళం అధికారి ఒకరు తెలిపారు.
అపార్ట్మెంట్లోని ఇతర కుటుంబాలను సమీపంలోని మరో అపార్ట్మెంట్కు తరలించారు. స్థానిక బొమ్మనహళ్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ సతీశ్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.