విజయనగరం : ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో వసూలు చేస్తున్న విద్యుత్ చార్జీల భారాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే 2000వ సంవత్సరంలో జరిగిన బషీరాబాగ్ ఉద్యమం మళ్లీ తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ట్రూ ఆఫ్ చార్జీలు భారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరంలోని స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ … ఎన్నికల ముందు విద్యుత్ చార్జీల భారం ప్రజలపై వేయం అని చెప్పి నేడు రెండు దఫాలుగా విద్యుత్ భారాలు రాష్ట్ర ప్రభుత్వం వేయడం అన్యాయమన్నారు. 2000వ సంవత్సరంలో ప్రపంచ బాంక్ జీతగాడు అని పిలిపించుకునే చంద్రబాబు… నేడు అదానికి లొంగిపోయి విద్యుత్ చార్జీలు భారాలు వేయడం దారుణమన్నారు. మోడీ చెప్పిన విధానంలోనే తందానా తానా అంటూ భజన చేస్తూ రాష్ట్ర ప్రజలపై భారం వేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి విద్యుత్ భారాలు తగ్గించే విధంగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే 2000వ సంవత్సరంలో విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా భాషీరాబాగ్ ఉద్యమం మళ్లీ మన రాష్ట్రంలో నిర్వహించడం ఖాయమని అన్నారు. వెంటనే విద్యుత్ భారాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.రమణమ్మ, కె.సురేష్, సిహెచ్ వెంకటేష్, యుఎస్.రవికుమార్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.