ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఓ వార్తా పత్రిక ‘దొంగలతో దోస్తీ‘ అంటూ ప్రచురించిన కథనంపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కథనం పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కించపర్చేలా ఉందని చెప్పారు. మీడియా సమాజంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించవద్దని హితవు పలికారు.పోలీసులపై ప్రజలకున్న నమ్మకాన్ని పత్రికలు చెడగొట్టకూడదని సీపీ చెప్పుకొచ్చారు. ఆ కథనంపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్తో పాటు రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.పోలీసుల నియామకాలతో పాటు బదిలీల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆ కథనంలో పేర్కొన్నారని అంజనీ కుమార్ చెప్పారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమైనవని, ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల విధుల్లో రాజకీయ జోక్యం జరగలేదని కేంద్ర సంస్థలు కూడా ప్రశంసించాయని ఆయన చెప్పారు. మరోసారి బాధ్యతారహితంగా వార్తలు ప్రచురించవద్దని ఆయన కోరారు.కాగా, పోలీసు శాఖ పోస్టింగుల్లో రాజకీయ జోక్యం పెరిగిందని ఆ కథనంలో తెలిపారు. భూ వివాదాల్లో తలదూర్చిన ఆరోపణలతో కొందరు పోలీసు అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారని, ఇసుక అక్రమ రవాణాదారుల నుంచి డబ్బు తీసుకుంటున్నారని కొందరు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ కథనంపై హోంమంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. ఈ పత్రిక తీరును ఎండగట్టారు. చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించి రుజువు చేయాలని సవాల్ విసిరారు. లేదంటే రూ.వెయ్యి కోట్లు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉగ్రవాదం – తీవ్రవాదం తదితర సంఘ విద్రోహక కార్యక్రమాలను తుడిచిపెడుతున్న పోలీసులపై ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. వెంటనే పత్రిక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.