హొసూరు : ఇక్కడికి సమీపంలోని బేగేపల్లి వద్ద దారికి అడ్డంగా ఓ లేఔట్ డెవలపర్లు ప్రహరీ నిర్మించడంతో స్థానికుల ఆందోళన కారణంగా ఉద్రిక్తత నెలకొంది. బేగేపల్లి గ్రామస్థులు సుమారు వందేళ్లుగా తిరుగుతున్న దారిని సరస్వతి లేఔట్ డెవలపర్లు అడ్డగించి ప్రహరీని నిర్మించారు. దీనివల్ల ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి, రైతులకు ఇబ్బందిగా మారింది. దారిని అడ్డగించడంతో ఆ ప్రాంత ప్రజలు లేఔట్ డెవలపర్లను నిలదీశారు. వందల ఏళ్లుగా తిరుగుతున్న దారికి అడ్డంగా ప్రహరీ నిర్మించకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు తొలుత డెవలపర్లను కోరారు. వారు పట్టించుకోకపోవడంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విచారణ చేపట్టారు. దారి తమ పట్టా భూమిలో ఉన్నందున, ఇకమీదట దారి వదలడం కుదరదని డెవలపర్లు తెగేసి చెప్పారు. దీంతో
అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అధికారులు డెవలపర్లతో చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. ప్రహరీని కూల్చి వేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని గ్రామస్థులు అధికారులను హెచ్చరించారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.