యువవైద్యురాలు దిశ హత్యాచార నిందింతులకు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో పోలీసులు నిందితులను చర్లపల్లి జైలులోని కట్టుదిట్టమైన భద్రత ఉండే మహానది బ్యారక్లో ఉంచారు.అయితే జైలు అధికారులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుందని తెలుస్తోంది.వారిని ఇతర ఖైదీలు చంపేయ వచ్చని జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను హై సెక్యూరిటీ బ్లాక్ లో ప్రస్తుతం ఉంచారు. ఈ బ్లాక్ లోని గదుల్లో ఒక్కొక్కరినీ ఒక్కో గదిలో ఉంచారు. 24 గంటలూ కాపలా పెట్టారు.2012ల న్యూఢిల్లీ నిర్భయ కేసులో నిందితుడైన రామ్ సింగ్, తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అటువంటి ఘటనే ఇక్కడ జరుగకుండా చూడాలని, ఇతర ఖైదీలు వారిపై దాడి చేయకుండా చూడాలని జైలు అధికారులు భావిస్తున్నారు. నిందితులు మానసికంగా బలహీనపడి పోయారని,నిద్ర పోవడం లేదని జైలు అధికారి ఒకరు తెలిపారు.నిందితులపై ప్రజలకు ఉన్న ఆగ్రహం నేపథ్యంలో ఇతర ఖైదీలు దాడి చేయకుండా చూస్తున్నామని తెలిపారు. ఇతర ఖైదీలు ఇంతవరకూ వీరితో మాట్లాడటం లేదా కలిసే అవకాశం ఇంతవరకూ కలుగలేదని అన్నారు.నిందితుల విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగవచ్చని సమాచారం. వీరిని మహబూబ్ నగర్ కోర్టుకు తీసుకెళ్లాలంటే కష్టమని అటు జైలు అధికారులు ఇటు పోలీసులు భావిస్తుండటమే దీనికి కారణం.