హొసూరు : అధికారుల నిర్లక్ష్యం వల్ల హొసూరు కెలవరపల్లి డ్యామ్ నీరు కాలువల ద్వారా సకాలంలో వరి పంటలకు అందకపోవడంతో రైతులు శ్రమ దానం చేయాల్సి వచ్చింది. కలవలపల్లి ఆయకట్టు ప్రాంతంలో ఎనిమిది వేల ఎకరాలలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా సకాలంలో నీరు అందకపోవడంతో కాలువలను శుభ్రపరచి పంటలకు నీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు అధికారులకు విన్నవించారు. స్పందన లేకపోవడం, పంటలు ఎండిపోతుండడంతో కాలువలో పేరుకుపోయిన చెత్తాదారాన్ని తొలగించడానికి రైతులు నడుం బిగించారు. హొసూరు సమీపంలోని సామనపల్లి గ్రామస్థులు సుమారు కిలోమీటరు దూరం వరకు శ్రమదానంతో కాలువలను బాగు చేసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల వరి పంటలకు నీరు అందలేదని, కాలువలను శుభ్రం చేయాలని పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. చేసేది లేక తామే కాలువలను శుభ్రం చేస్తున్నామని తెలిపారు.