భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా సెంచూరియన్లోని సూపర్స్పోర్ట్ పార్కులో మంగళవారం తొలి టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా బుమ్రా కుడి చీలమండ బెణికింది. అతను తీవ్ర నొప్పితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్, బుమ్రా స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్నాడు. వైద్య బృందం బుమ్రా గాయాన్ని పరిశీలిస్తోందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అయిదో బంతిని విసురుతున్నప్పడు బుమ్రా చీలమండ బెణికింది. వెంటనే అతను ఫిజియో సాయంతో మైదానం నుంచి నిష్క్రమించాడు.