హోసూరు : భవన నిర్మాణ కార్మికుడు హోసూరులో దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణగిరి జిల్లా అంచెట్టి సమీపంలోని సెంగోటై గ్రామానికి చెందిన ధనపాల్(27కు సత్య అనే యువతితో ఏడాది కిందట వివాహం జరిగింది. ధనపాల్ భవన నిర్మాణ కార్మికుడు కావడంతో భార్యతో కలసి హోసూరు సమీపంలోని బేగేపల్లి గ్రామంలో నివాసముంటున్నాడు. గురువారం వేకువ జామున గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అతను దారుణ హత్యకు గురయ్యాడు. వేకువ జామున ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, అంతలోనే తీవ్రంగా గాయపడి ఇంటికి చేరుకొని మృతి చెందాడని ధనపాల్ భార్య సత్య పోలీసులకు తెలిపింది. ఈ సంఘటనపై హోసూరు సిప్కాట్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ధనపాల్ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.