కాన్పూర్ : న్యూజిలాండ్తో జరుగుతోన్న టెస్ట్ మ్యాచ్ తొలి రోజు పూర్తయింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరగుల వద్ద ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 21 పరుగుల వద్ద టీమిండియా మయాంక్ అగర్వాల్ వికెట్ను కోల్పోయింది. అనంతరం వచ్చిన శుభ్మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 79 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో అర్థ సెంచరీ పూర్తి చేసి జట్టు స్కోరును పెంచాడు. కాసేపటికే 52 పరుగల వద్ద జైమిషన్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. అనంతరం ఛెతేశ్వర పూజారా 26 పరుగుల వద్ద సౌతీ బౌలింగ్లో బ్లండెల్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. తర్వాత రహానే కూడా 35 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 145 పరుగుల వద్దే టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా దూకుడుగా ఆడారు. ఆచితూచి ఆడుతూనే అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పెంచారు. ఈ క్రమంలోనే 208 బంతుల్లో వీరిద్దరి భాగస్వామ్యం 113 పరుగులకు చేరింది. ప్రస్తుతం జడేజా (50), శ్రేయస్ అయ్యర్ (75) క్రీజులో ఉన్నారు.