సిడ్నీ: కరోనా (కోవిడ్ 19) వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రద్దయింది. శుక్రవారం ఇరు జట్లు తొలి వన్డే ఆడాయి. న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టే వారిని కచ్చితంగా 14 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని ఆ దేశం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంక్షలు అమలయ్యే ముందే స్వదేశానికి తరలిపోవాలని కివీస్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వన్డే సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్లో ఆడాల్సిన టీ20 సిరీస్ సైతం రద్దైనట్లే. మరోవైపు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడా టోర్నీలను అర్ధాంతరంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తొలి వన్డేలో తలపడ్డాయి. ప్రేక్షకులు లేకుండానే సాగిన ఈ మ్యాచ్లో ఆసీస్ 71 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం కివీస్ పేసర్ లాకీ ఫెర్గూసన్ గొంతునొప్పి వస్తోందని చెప్పడంతో అతడికి వెంటనే కరోనా పరీక్షలు చేయించారు. ప్రస్తుతం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కివీస్ జట్టు పేర్కొంది.