అమరావతి: ఏపీ, తెలంగాణల మధ్య అంతర్ రాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లో అవగాహన ఒప్పందంపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు సంతకాలు చేశారు. దీని ప్రకారం ఏపీలో 1,61,258 కి.మీ. మేర టీఎస్ ఆర్టీసీ బస్సులు, తెలంగాణలో 1,60,999 కి.మీ. మేర 638 బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ నడపనుంది. మార్చి 22న కరోనా కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ‘ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర నిబంధనల ప్రకారమే బస్సులు నడిపాం. ఇప్పుడు తాజా ఒప్పందం ప్రకారం ఆర్టీసీ బస్సులు నడప బోతున్నాం. ఇతర రవాణా వాహనాలు పునరుద్ధరిస్తాం. రెండు రాష్ట్రాలు లక్ష కి.మీ లు నడపాలంటే కష్టమే. సాధారణ స్థితికి రావడానికి మరో ఆరు నెలల సమయం పట్టవచ్చు. లక్ష కి.మీలు రెండు రాష్ట్రాలు తిప్పకపోతే పునరాలోచన చేయాల్సి ఉంటుంది’ అని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ బాబు తెలిపారు.