స్థానికులకు రిజర్వేషన్‌పై సుప్రీం కీలక తీర్పు

ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్ల అంశం  చర్చనీయాంశమవుతోంది. దీనివల్ల ప్రతిభగలవారికి అన్యాయం జరుగుతోందని ప్రైవేట్ యాజమాన్యాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్ అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న హర్యానా ప్రభుత్వ చట్టాన్ని సమర్థించింది. ఈ నిర్ణయంపై స్టే విధించిన పంజాబ్-హర్యానా హైకోర్టు నిర్ణయాన్ని కొట్టేసింది. ఇదే సమయంలో ఈ చట్టాన్ని అమలుపరచని ప్రైవేట్ సంస్థలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కూడా హర్యానా ప్రభుత్వానికి సుప్రీం సూచించింది. నాలుగు వారాల్లో ఈ వ్యవహారంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పంజాబ్ -హర్యానా హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.
హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ప్రతిభకు, రాజ్యాంగానికి విరుద్ధమని ప్రైవేటు యాజమాన్యాలు వాదిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ చట్టం కేవలం భౌగోళిక వర్గీకరణను మాత్రమే ప్రస్తావిస్తోందని, దీనికి రాజ్యాంగం అనుమతిస్తోందని చెబుతోంది. రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల జీవించే హక్కు, జీవనోపాధి హక్కు, ఆరోగ్య, హక్కు, జీవన ప్రమాణాలు, ఉపాధి పొందే హక్కులను కాపాడటానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు వాదించింది. హర్యానా రాష్ట్ర స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టం, 2020 ప్రకారం నెలకు రూ.30,000 కన్నా తక్కువ వేతనం చెల్లించే ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలి. ఈ చట్టం జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది. హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ గతంలో కొన్ని ప్రైవేట్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులపై పంజాబ్ -హర్యానా హైకోర్టు స్టే విధించింది. దీనిపై హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో హర్యానా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos