న్యూ ఢిల్లీ : రక్షణ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు తీవ్రతరం అవుతున్నాయి. బిహార్లో నిరసనలు తీవ్ర రూపాన్ని సంతరించు కున్నాయి. నిరసనకారులు భారీ ఎత్తున పోగై రైలు బోగీలకు నిప్పు పెడుతున్నారు. రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టిస్తున్నారు. గురువారం నిరసన కారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయగా, పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. భారత సైన్యం, ఇతర రక్షణ దళాల్లో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతూ, సిద్ధమవుతున్నవారు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. డిఫెన్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రారంభ మవడం కోసం రెండేళ్ళ నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వీరంతా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఈ నిసనలు భారీగానే కొనసాగుతున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు కొనసాగిస్తున్నారు.