తెలంగాణలో ఒకే రోజు పది పాజిటివ్ కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారని.. ప్రస్తుతానికి 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హోం క్వారంటైన్‌తో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో సుమారు 20వేల మంది పర్యవేక్షణలో ఉన్నారని.. వారి గురించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని సీఎం తెలిపారు. ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. లాక్‌డౌన్‌కు మంచి సహకారం అందిస్తున్నారు. ప్రజల నుంచి సహకారం లేకపోతే పరిస్థితి ఇంకా భయంకరంగా ఉండేది. అందరి బతుకులు ప్రమాదంలో పడేవి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈరోజు 10 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంత భయకరమైన వ్యాధో అర్థం చేసుకుంటే అంత సులభం. ప్రపంచంలో దీనికి మందు లేదు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు. అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలో 11వేల వెంటిలేటర్లు ఉన్నాయి. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే 3వేలు ఉన్నాయి. ప్రస్తుతం వారి అవసరం మేరకు వారికి 30 వేల వెంటిలేటర్లు కావాల్సిన పరిస్థితి ఉంది. అన్ని వనరులూ ఉన్నఅమెరికాలాంటి దేశమే ఆగమాగమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం. గుంపులు రోడ్ల మీదకు రాకపోవడం..స్వీయ నియంత్రణ, పారిశుద్ధ్యం పాటించడం తప్ప మనకి గత్యంతరం లేదు’అని కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos