ప్రజల ఖాతాల్లోకి డబ్బు

ప్రజల ఖాతాల్లోకి డబ్బు

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారానికి వస్తే ప్రతి పేదవాడికి కనీస ఆదాయం అందిస్తామని, తద్వారా అందరి ఆకలి తీరుస్తామని, పేదరికాన్ని పారదోలుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో ‘సార్వత్రిక కనీస ఆదాయం(యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్-యూబీఐ)’ పథకంపై చర్చ ఊపందుకొంది.భారత్‌లో యూబీఐ పథకం తరచూ, ముఖ్యంగా ఎన్నికల సమయంలో తెరపైకి వస్తుంటుంది. దీని మంచిచెడులు, సాధ్యాసాధ్యాలు, ఇతర అంశాలు చర్చలోకి వస్తుంటాయి.సాధారణంగా ఏదైనా దేశం లేదా రాష్ట్రంలో యూబీఐ పథకం ఉంటే పౌరులందరికీ కనీస ఆదాయాన్ని ప్రభుత్వమే బేషరతుగా అందిస్తుంది. ఆర్థిక స్థితి, సామాజిక స్థితి, ఉపాధితో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్ణీత సొమ్మును అందజేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఎవరి భాగస్వామ్యం ఎంతనేదానితో నిమిత్తం లేకుండా పౌరులందరికీ సముచిత ఆదాయం ఉండాలనే భావనే యూబీఐ పథకానికి మూలం.పేదరిక నిర్మూలనకు యూబీఐ అత్యుత్తమ మార్గమని దీనిని సమర్థించేవారు చెబుతారు. ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితం ఉండేలా పటిష్ఠమైన సామాజిక భద్రతను ఇది కల్పిస్తుందని అంటారు.యూబీఐని వ్యతిరేకించే వాదనలూ ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది- ఇది ఉత్పాదకతను తగ్గిస్తుందనే వాదన. అత్యధికులు క్రమం తప్పకుండా ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాల్లో జమచేసే డబ్బు కోసం ఎదురుచూస్తారే తప్ప పనిపై ఆసక్తి చూపరని, వారు ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భాగస్వాములు కాబోరని యూబీఐని బలంగా వ్యతిరేకించేవారు వాదిస్తారు.యూబీఐ పథకానికి 2016-17 ఆర్థిక సర్వే మద్దతు పలికింది. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)తోపాటు ప్రజలకు కల్పిస్తున్న ఇతర ప్రయోజనాల స్థానంలో యూబీఐని తీసుకురావొచ్చని అప్పటి ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు.

సర్వే ఏం చెప్పిందంటే…

1) విధానపరంగా చూస్తే యూబీఐ ఎంతో ఆకర్షణీయమైనదని చెప్పింది. పేదరిక నిర్మూలన కోసం అమలు చేస్తున్న వివిధ సామాజిక సంక్షేమ పథకాలకు యూబీఐ పథకం ప్రత్యామ్నాయం కాగలదని వ్యాఖ్యానించింది.2) యూబీఐ పథకం అమల్లో చాలా సవాళ్లు ఉంటాయని ఆర్థిక సర్వే చెప్పింది. ఇప్పటికే ఉన్న పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాలకు ప్రత్యామ్నాయంగా కంటే కూడా వాటికి అదనపు పథకంగా ఇది మారే ముప్పు ఉందని, అదే జరిగితే ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడింది.3) యూబీఐ విజయవంతం కావడమనేది ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక సర్వే తెలిపింది. ”మొదటి అంశమేంటంటే- జన్‌ధన్ ఖాతాల వినియోగం, ఆధార్ అనుసంధానం, మొబైల్ వాడకం ఉండటం. ఇది నగదు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి పంపడానికి ఉపయోగపడుతుంది. రెండోదేమిటంటే- పథకం వ్యయంలో ఎవరు ఎంత భరించాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే చర్చలు” అని వివరించింది.4) పేదరికాన్ని అర (0.5) శాతానికి తగ్గించే విధంగా యూబీఐ పథకాన్ని అమలు చేయాలంటే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో నాలుగు నుంచి ఐదు శాతం వరకు వ్యయమవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఆదాయం మెరుగ్గా ఉన్నవారిలో మొదటి 25 శాతం మందిని మినహాయించి పథకాన్ని అమలు చేస్తే వ్యయం ఇలా ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడు మధ్యతరగతికి అందిస్తున్న రాయితీలు, ఆహారం, పెట్రోలియం, ఎరువుల రాయితీల వాటా జీడీపీలో ఇంచుమించు మూడు శాతంగా ఉందని ప్రస్తావించింది.5) యూబీఐ ఒక శక్తిమంతమైన ఆలోచన అని, దీనిని అమలు చేయాల్సిన సమయం ఇంకా రాలేదని అనుకున్నా, దీనిపై లోతైన చర్చ జరగాల్సిన తరుణమైతే వచ్చిందని ఆర్థిక సర్వే ముక్తాయించింది.

యూబీఐ స్వరూపం ఏమిటి?

యూబీఐ అమలుకు మద్దతు పలికే మేధావులతో కూడిన నెట్‌వర్క్ ‘బేసిక్ ఇన్‌కమ్ ఎర్త్ నెట్‌వర్క్(బీఐఈఎన్)’ – ఈ పథకంలో ప్రధానంగా ఐదు అంశాలు ఉంటాయని చెబుతోంది.

1) అంతా ఒకేసారి కాకుండా నిర్ణీత వ్యవధిలో విడతల వారీగా డబ్బు అందించడం.2) ఆహార వోచర్లు, సేవా కూపన్లు లాంటివి ఇవ్వడం కాకుండా నగదు ఇవ్వడం.3 ) కుటుంబం లెక్కన కాకుండా ప్రతి వ్యక్తికీ ఇవ్వడం.4) సార్వజనీనంగా పౌరులందరికీ అందజేయడం.5) ఆదాయం లేదా ఉపాధితో నిమిత్తం లేకుండా బేషరతుగా ఇవ్వడం.

ఉత్తర ఐరోపాలోని స్కాండినేవియా ప్రాంతంలో ఉండే ఫిన్‌లాండ్‌తోపాటు మరికొన్ని దేశాల్లో వేర్వేరు నమూనాల్లో యూబీఐని తీసుకొచ్చారు. ప్రయోగాత్మక అమలును చేపట్టారు.

1) ఫిన్‌లాండ్ ప్రభుత్వం ఉపాధిలేని రెండు వేల మందికి 2017 జనవరి నుంచి రెండేళ్లపాటు ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. 25 నుంచి 58 ఏళ్ల మధ్య వయసున్న ఈ లబ్ధిదారులకు నెలకు 560 యూరోలు(సుమారు రూ.45 వేలు) చొప్పున అందించింది. ఐరోపాలో జాతీయ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని తొలిసారిగా అమలు చేసిన దేశం ఫిన్‌లాండే. ఈ పథకాన్ని ఇక కొనసాగించబోమని ఇటీవలే ప్రకటించింది. సామాజిక భద్రత వ్యవస్థను సమూలంగా మార్చేందుకు, బ్యూరోక్రసీని తగ్గించేందుకున్న అవకాశాలను ప్రభుత్వం ఈ ప్రయోగంలో పరిశీలించింది.2) కెనడాలోని ఓంటారియో రాష్ట్రం సామాజిక సంక్షేమ పథకాల కన్నా యూబీఐ మెరుగైనదా, కాదా అన్నది తేల్చేందుకు 2017లో మూడు ప్రాంతాల్లో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టింది. మూడేళ్లపాటు అమలు చేయాలనుకున్న ఈ పథకాన్ని ప్రారంభించిన కొన్ని నెలలకే ఆపేసింది. దీనిని సుదీర్ఘకాలం అమలు చేయలేమని ప్రభుత్వం చెప్పింది.3) వాయువ్య ఐరోపాలోని నెదర్లాండ్స్‌లో, దక్షిణ ఐరోపాలోని ఇటలీలో ప్రయోగాత్మకంగా యూబీఐ అమలును చేపట్టారు.4) ఆఫ్రికాలోని కెన్యా పశ్చిమ ప్రాంతంలో ఉండే ఒక గ్రామంలో పెద్దవాళ్లలో ఒక్కొక్కరికి నెలకు 22 డాలర్లు చొప్పున ప్రభుత్వం డబ్బు అందిస్తోంది. ఈ పథకాన్ని 12 ఏళ్లపాటు అమలు చేయాలని నిర్ణయించారు. క్రమం తప్పకుండా నేరుగా డబ్బు అందిస్తే ప్రజలను పేదరికం నుంచి బయటపడేయవచ్చా అన్నది ఇక్కడ పరీక్షిస్తున్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos